ఒక చిట్టి కథ*
చిత్రపురి ని పరిపాలించే విక్రమవర్మ మహారాజుకు వేట అంటే ప్రాణం.
ఒకరోజు వేటాడడానికి అడవికి వెళ్లాడు...కాని ఒక్క జంతువు కూడా పట్టుకోలేక పోయాడు ..
నిరాశతో దిగులుగా తన కోటకు తిరిగి వచ్చాడు .
దీనికంతటికీ కారణం ఉదయాన్నే తనకు ఎదురు వచ్చిన పేద రైతు అని నిర్ధారణకు వచ్చాడు.
వెంటనే ఆ రైతు ని పిలిపించి 'నీవు ఎదురు రావడం మూలంగా అడవిలో కనీసం ఒక్క జంతువునైనా వేటాడ లేకపోయాను దీనికి తగిన శిక్ష నీవు అనుభవించాల్సిందే ..అని అతనికి మరణశిక్ష విధించాడు .
ఆ పేద రైతు లబోదిబోమన్నాడు... 'మహారాజా నేనేమీ తప్పు చేయలేదు దయచేసి నన్ను వదిలి పెట్టండి అని వేడుకున్నాడు .
అయినప్పటికీ రాజు కనికరించలేదు ..ఇక ఆఖరి ప్రయత్నంగా ఆ పేద రైతు' ప్రొద్దునే నా మొహం చూసి వేటకు వెళ్లడం వలన మీరు ఒక్క ప్రాణి కూడా చంప లేకపోయారు దాని వలన మీకు పుణ్యమే కదా వచ్చింది కానీ నేను మీ ముఖం చూసి నందుకు నాకీ మరణశిక్ష న్యాయమా 'అని అడిగాడు .
ఈ మాటలకు మహారాజుకు జ్ఞానోదయం అయింది .
అనవసరంగా రైతును .శిక్షిస్తున్నానని గుర్తించి అతనికి ధనధాన్యాలు ఇచ్చి పంపించాడు.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు..
యదా కించిజ్ఞొహం గజ ఇవ మదాంధః సమభవమ్
తదా సర్వజ్ఞొస్మీత్యభవ దవ లిప్తం మమ మనః|
యదా కించిత్ కించిత్ బుధజన సకాశా దవగతమ్
తదా మూర్ఖెస్మీతి జ్వర ఇవ మదొమె వ్యపగతః||
------భర్త్రుహరి
నాకు మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు ’నాకు ఎంతో తెలుసు, నాతో సరిసమానమైన జ్ఞానం ఉన్నవాళ్లు ఈ ప్రపంచంలోనే లేరు’ అని నాకు ఒక ఏనుగుకు ఉన్నంత మదం ఉండేది. కానీ మెల్లగా నాకు నిజమైన పండితులతో సహవాసం ఏర్పడింది… వాళ్ల సహవాసంతో నాకు తెలిసివచ్చినదేంటంటే – ’నాకు ఏమీ తెలియదని — అన్నీ తెలుసు అనుకునే ఒక మూర్ఖుడిని’ అని! నాకు తెలియనిది ఈ ప్రపంచంలో ఎంతో వుందని అర్ధమైన తర్వాత నా మదం జ్వరంలాగా దిగిపోయింది…