*ధర్మో రక్షతి రక్షితః.....*
ఈ మూల శ్లోక పాదం వ్యాస విరచిత మహాభారతంలోనిది. ముందు దీని సందర్భం చెప్పుకుని, తర్వాత పై శ్లోక పాదం అర్ధం తెలుసుకుందాం.
పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు నీరు త్రాగడానికి చిన్నవాడైన సహదేవుడు ఒక మడుగుదగ్గరకి వెళ్తాడు. ఆ మడుగుకు కాపలా ఉన్న ఒక యక్షుడు తన ప్రశ్నలకు జవాబిస్తేగాని నీళ్ళు త్రాగకూడదని అడ్డుకుంటాడు. అతణ్ణి లక్ష్యపెట్టకుండా సహదేవుడు మడుగులో నీరుత్రాగి మరణిస్తాడు. తమ్ముణ్ణి వెతుక్కుంటూ వచ్చి నకులుడు, ఆ తర్వాత అతని కోసం అర్జునుడు, అర్జునిడి కోసం భీముడు మడుగు దగ్గరకు వెళ్ళి ప్రాణాలు విడుస్తారు. సోదరులు ఎంతకూ రాకపోయేసరికి ధర్మరాజు వెళ్ళి యక్షుడి ప్రశ్నలకు సరియైన సమాధానాలిస్తాడు. యక్షుడు సంతోషించి చనిపోయిన నలుగిరిలో ఒకరిని బ్రతికిస్తానని ఎవరు కావాలో కోరుకోమంటాదు. నకులుణ్ణి బ్రతికించమని ధర్మరాజు కోరుతాడు. యక్షరూపంలో ఉన్న ధర్మదేవత సొంత తమ్ములైన భీమార్జునులలో ఒకరిని ఎందుకు కోరుకోలేదని అడుగుతాడు.
అపుడు ధర్మరాజు
*ధర్మ ఏవ హతో హంతి,*
*ధర్మో రక్షతి రక్షితః,*
*తస్మాత్ ధర్మం నత్య జామి మానో ధర్మోహ వధీత్*
"ధర్మానికి మనం కీడు చేస్తే అది మనలను సంహరిస్తుంది. ధర్మాన్ని మనం పాటిస్తే అది మనలను రక్షిస్తుంది. నేనెప్పుడూ ధర్మాన్ని వదలను. పక్షపాతం లేకుండా ప్రవర్తించడమే పరమధర్మం. నా ఇద్దరు తల్లులలో కుంతీపుత్రుణ్ణి నేను బ్రతికే ఉన్నాను. ఇక బ్రతకవలసినవాడు నా సవతి తల్లి మాద్రి పెద్దకొడుకు నకులుడే కదా అప్పుడేకదా ధర్మంలో వైషమ్యం (తేడా) ఉండదు" అంటాడు.
ధర్మజుడి ధర్మ సూక్ష్మ వివరణకు సంతోషించిన ధర్మదేవత, చనిపోయిన ధర్మరాజు నలుగురు సోదరుల్నీ బ్రతికిస్తాడు.