కొత్త యుద్ధం (కరోనా కధ )
―――――――――――
అది ఒక జింకల వనం . అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .
ఒకసారి ఆవనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది . అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు తోడేళ్ళను , పులులను , సింహాలను , నక్కలను తొలిసారి అక్కడే చూసింది .
అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది .
" అవును మాది జింకలవనం " అంది .
" ఈ అడవి మీ జింకలవనం లాంటిది కాదు . ఇక్కడ మనల్ను చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి . వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తేలియదు . కాబట్టి ఇక్కడినుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది .
" పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకలవనం జింక ముందుకు వెళ్ళింది .
అక్కడ చెట్టుకింద నిద్రపోతున్న సింహం కనిపించింది . జింక చిన్నగా దానిదగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .
సింహానికి మెలకువ వచ్చింది . బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది . ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంతపని అయింది . వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది . అడవిని దాటి జింకలవనం వైపు పరుగు తీస్తూనేవుంది . జింకలవనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది . సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .
తరువాత సింహం లేచి మెల్లగా జింకలవనం లోకి వేళ్ళింది . దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి . సింహం ఆనందానికి అంతులేదు . దొరికిన జింకను. దొరికినట్టు చంపి తినేస్తుంది .
కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి . చెల్లాచెదురు అయ్యాయి.పొదల్లో దాక్కున్నాయి .బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నాయి .
పొరపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .
అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది . దాని పేరు జ్ఞాననేత్ర . జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మారర్గం ఏమిటి " అని అడిగాయి .
" జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను . ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు . దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.
ఎటు ఆలోచించినా . . ఎంత యోచించినా ఒకేఒక్క దారి కనిపిస్తుంది . ఈ సింహం ఆహారం లేకుండా
14 రోజులు మాత్రమే బ్రతక గలదు . కానీ మనం 21రోజులు బ్రతకగలం . కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు
దాని పీడ మనకు విరగడౌతుంది . మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవితకాలం మరో 14రోజులు పెంచినట్లే .
ఈరోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం
పున్నమి నాటికి బయటకు వద్దాం తమ పొదలనుండి
బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పేద్దలదే." అంది .
జింకలన్నీ జ్ఞాననేత్రం మాటలు విన్నాయి .ఆకలితో
అలమటించాయి .
💐 పన్నమి వచ్చింది . జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి . వనం మధ్య చెట్టుకింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి . ఆనందంతో అరిచాయి , గెంతాయి . జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది .💐
( ( ( కరోనా సందర్భంగా 9 -4-20న ఆంధ్రజ్యోతిలో
" కొత్త యుద్ధం " పేరుతో సందేశాత్మకంగా మేల్కోలిపే
కధనాన్ని అందించిన బౌద్ధ రచయిత బొర్రాగోవర్థన్ గారికి ధమ్మాభివందనాలు .) ) )