Nehru gari gurinchi meku theliyani vishayalu || నెహ్రూ గారి గురించి మీకు తెలియని విషయాలు:

Nehru gari gurinchi meku theliyani vishayalu || నెహ్రూ గారి గురించి మీకు తెలియని విషయాలు:

SHYAMPRASAD +91 8099099083
0
Nehru gari gurinchi meku theliyani vishayalu:
నెహ్రూ గారి గురించి మీకు తెలియని విషయాలు:

అసలు నెహ్రూ కాశ్మీరీ పండితులే కాదు, అసలు హిందువే కాదు, వాళ్ళు ముస్లింలు, ఇలా సోషల్ మీడియాలలో నింపేశారు అరగుండు మేథావులు. ఇప్పుడు ఉన్న స్పీడ్ యుగంలో ఎక్కువ మంది యువత చరిత్ర చదవడానికి పెద్దదిగా ఆసక్తి చూపడం లేదు, వారంతా వాట్సాప్ లో వచ్చే అబద్ధాలే నిజమని నమ్ముతున్న వేళా చరిత్ర కనుమరుగైపోవడమే కాకుండా అనేకమంది ఉదాత్తుల చరిత్రను వక్రీకరించి సోషల్ మీడియాలలో నేటి తుచ్ఛ రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. మన దేశంలో ఎక్కువగా చరిత్ర హననానికి గురైంది మాత్రం దేశ మొదటి ప్రదానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. అయితే వారి పూర్వీకులు ఎవరు? వాళ్ళ పరంపర ఎలా సాగిందో చూద్దాం. 

మొదటగా పండిట్ రాజ్ కౌల్, ఆయనది నేటి శ్రీనగర్ లో భాగమైపోయిన 'హబ్బా కాదల్' అనే గ్రామం. ఇప్పటికి శ్రీనగర్ లో ఉంది. 1716 లో అప్పటి డిల్లీ సుల్తాన్ ఫర్రీఖుసియర్ కాశ్మీర్ వెళ్ళినప్పుడు రాజ్ కౌల్ చూశాడు. ఆయన పారసీ భాషకు ముగ్దుడై డిల్లీకి రమ్మని ఆహ్వానించడు. దాంతో రాజ్ కౌల్ డిల్లీ చేరుకున్నాడు. ఫర్రీఖుసియర్ కౌల్ ను రాజ కుటుంబీకులకు పారసీ నేర్పడం కోసం నియమించాడు. రాజ్ కౌల్ కుటుంబం ఉండటానికి యమునా నది కాలువ (హిందీలో నెహర్ అంటారు, అప్పటికి హిందీ లేదు, పారసీ, ఖడీ భాషలలో నెహ్ర్ అని అనేవారు) పక్కన బంగ్లా ఇచ్చాడు. 

1725 లో రాజ్ కౌల్ కు కొడుకు పుట్టాడు, అతని పేరు పండిట్ విశ్వనాథ్ కౌల్ అని నామకరణం చేశారు. ఆయన కూడా తదపరి డిల్లీ సుల్తాన్ ల వద్ద ముఘల్ న్యాయ విభాగంలో పని చేసేవాడు. ఆయనకు ముగ్గురు సంతానం, వరసగా సాహిబ్ రామ్, మన్షారామ్, టికారామ్. ఇక్కడ నుంచే కౌల్ అనే surname/title/ఇంటిపేరు బదులుగా స్థానం అంటే పైన చెప్పిన విధంగా నెహ్ర్ గా పిలవడం మొదలైంది. అదే కాలక్రమేణా నెహ్రూగా మారి వారి పేరులో నెహ్రూ భాగమైపోయింది. వీళ్ళు ముగ్గురు కూడా పారసీ భాషలో ప్రతిభ కలవారు. వారు కూడా డిల్లీ ముఘల్ వద్దే పని చేసేవారు. 

మన్షారామ్ కుమారుడు లక్ష్మీ నారాయణ్ నెహ్రూ, ఆయన కంపెనీ ప్రభుత్వం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంలో వకీల్/క్లర్క్ గా పని చేసేవాడు.
లక్ష్మీ నారాయణ్ నెహ్రూ ఇంట 1827 లో మగ సంతానం కలిగింది.  అతనికి గంగాధర్ నెహ్రూ అని నామకరణం చేశారు. గంగాధర్ నెహ్రూకు డిల్లీ చెందిన శంకర్ నాథ్ జుష్టి కుమార్తె జియోరాణి(ఇంద్రాణి)తో వివాహం జరిగింది. గంగాధర్ నెహ్రూ గుర్రపు స్వారీ చేయడంలో దిట్ట. దాంతో డిల్లీ సుల్తాన్ బహదూర్ షా గంగాధర్ నెహ్రూను డిల్లీకి కొత్వాల్ గా నియమించాడు. 1857 వరకు సాఫీగా జీవితం సాగుతోంది. నలుగురు సంతానం కలిగారు. 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటు సమయంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం బహదూర్ షా మీదకు సేనలను పంపింది. అప్పుడు జరిగిన విధ్వంసంలో గాయపడ్డ గంగాధర్ నెహ్రూ తన కుటుంబాన్ని తీసుకుని ఆగ్రా వెళ్ళిపోయాడు. అక్కడే తన ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరిపించి 1861 లో చనిపోయాడు. ఆ సమయంలో గంగాధర్ నెహ్రూ కుమారుల వయస్సు బన్సీధర్ నెహ్రూ 19, నందలాల్ 16 వారిని తీసుకుని పుట్టింట డిల్లీ చేరుకుంది జియోరాణి, అప్పుడు గర్భవతి. మూడు నెలల తర్వాత మోతిలాల్ నెహ్రూకు జన్మనిచ్చింది. అయితే అప్పటికి డిల్లీలో పరిస్థితులు చక్కబడలేదు. రెండు సంవత్సరాలు అక్కడ కాలం గడిపారు. పెద్ద కుమారుడు బన్సీధర్ బ్రిటిష్ న్యాయ వ్యవస్థలో చేరి కుటుంబం నుంచి దూరం అయ్యాడు. రెండవ కుమారుడు నందలాల్ కు ప్రస్తుతం రాజస్థాన్ లో ఉన్న ఖేతడి సంస్థానంలో దివాన్ పదవి లభించింది. నందలాల్ తమ్ముడు, తల్లితో కలిసి ఖేతడి చేరుకున్నాడు. తమ్ముని తమ్మునిగా కాకుండా కొడుకులా పెంచాడు. దురదృష్టవశాత్తు ఖేతడి రాజు 1873 ప్రాంతంలో చనిపోయాడు. తరువాత వచ్చిన వాళ్ళు నందలాల్ ను పక్కన పెట్టడంతో కుటుంబాన్ని ఆగ్రాకు తరలించి, అవసరమైన పరిక్షలు వ్రాసి న్యాయవాదిగా జీవితం మొదలు పెట్టాడు. అప్పట్లో హైకోర్టు ఆగ్రాలో ఉండేది. దానిని అల్హాబాద్ కు తరలించడంతో నందలాల్ నెహ్రూ కుటుంబాన్ని అల్హాబాద్ కు షిఫ్ట్ చేసి, తమ్ముడు మోతిలాల్ ను కాన్పూర్ లో చదువుకోవడానికి పెట్టాడు. నందలాల్ కు ఐదుగురు సంతానం. 

మోతిలాల్ నెహ్రూ 1883 లో కాన్పూర్ నుండి న్యాయవాద పట్టా సాధించి తిరిగి అల్హాబాద్ చేరుకుని అన్నా నందలాల్ తో కలిసి న్యాయవాదిగా జీవితం ప్రారంభించాడు. లాహోర్ కు చెందిన కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్వరూపరాణితో వివాహం జరిగింది. అనతికాలంలోనే గొప్ప న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అయితే మోతిలాల్ నెహ్రూ అన్న నందలాల్ 1886 లో మరణించడంతో మొత్తం కుటుంబాన్ని చూసుకునే భాద్యత మోతిలాల్ పై పడింది. ఆదాయానికి కొదువ లేదు దాంతో అల్హాబాద్ లో పెద్ద భవంతిని కొనుగోలు చేసి దానికి ఆనంద్ భవన్ అని పేరు పెట్టి కుటుంబం అందులో నివాసం ఉండేవారు. 1889 నవంబర్ 14 న జవహర్ లాల్ జన్మించాడు. మోతిలాల్ కు మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారే విజయలక్ష్మి పండిట్, కృష్ణ హుత్సింగ్. 

#NehruFamilyTree

రాజ్ కౌల్ 👉 విశ్వనాథ్ కౌల్ 👉 1) సాహిబ్ రామ్,2) మన్షారామ్, 3) టికారామ్.
మన్షారామ్👉 లక్ష్మీ నారాయణ్ నెహ్రూ👉 గంగాధర్ నెహ్రూ 👉 1)బన్సీధర్ నెహ్రూ,2) నందలాల్ నెహ్రూ, 3) మోతిలాల్ నెహ్రూ.
మోతిలాల్ నెహ్రూ👉 జవహర్ లాల్ నెహ్రూ 👉 ఇందిరాగాంధీ👉 రాజీవ్ గాంధీ, సంజీవ్ గాంధీ.
రాజీవ్ గాంధీ👉 రాహుల్, ప్రియాంక 
సంజయ్ గాంధీ👉 వరుణ్ గాంధీ.

-సశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!