భోగి : భోగభాగ్యాల పండుగే కాదు ఆరోగ్య ప్రదాయిని

భోగి : భోగభాగ్యాల పండుగే కాదు ఆరోగ్య ప్రదాయిని

SHYAMPRASAD +91 8099099083
0
🕉భోగి : భోగభాగ్యాల పండుగే కాదు ఆరోగ్య ప్రదాయిని🔥

 
తెలుగువారు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని నిర్వహిస్తారు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణ అర్ధగోళానికి భూమికి దూరంగా జరగడంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఉత్తరాయణానికి ముందురోజు చలి విపరీతంగా పెరగడంతో దీనిని తట్టుకునేందుకు మంటలు.. దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారు. అయితే, ఈ పండుగ రోజున భోగి మంటలు వెనుక పురాణం కథనం, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి

​పురాణాలలో భోగి.. బలి తిరిగి భూమిపైకి వచ్చే రోజు

భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చింది. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరో కథనం. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదేనంటారు. శాపం కారణంగా రైతుల కోసం పరమేశ్వరుడు తన వాహనం నందిని భూమికి పంపిన రోజు ఇదే అనేవి కూడా పురాణ గాథ.

​🔥భోగి మంటలతో ఆరోగ్యం

సాధారణంగా చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని భావిస్తారు. కానీ ఇది వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. ఆవుపేడతో చేసిన పిడకలని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశించి, ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. ఈ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. భోగి మంటల నుంచి వచ్చే గాలి వాటికి ఔషధంగా పని చేస్తుంది. భోగి మంటల్లో రావి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. అగ్ని హోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాముల ఆవు నెతి నుంచి 1 టన్ను ప్రాణవాయువు విడుదలవుతుంది. ఈ ఔషద మూలికలను ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వల్ల విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది.

🔥​శరీరాన్ని శుభ్రం చేసే భోగి మంటలు🔥

మన శరీరం లోని 72,000 నాడులలోకి ప్రవేశించి మలినాలను బయటకు పంపుతుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకోలేని పేదలు ఉంటారు.. కాబట్టి ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుంచి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల దూరాలను తగ్గించి ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధన, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.

ఆధునికత పేరుతో కాలుష్యం

కాని మనం ఆధునికత, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లు, పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పిలుస్తూ, కాలుష్యాన్ని పెంచుకుని మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తూ కొత్త రోగాలని కొని తెచ్చుకుంటున్నాం. భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని అంటారు. అయితే, పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాన్ని ఆ దేశాని ఆక్రమించుకోలేమని భావించిన బ్రిటిషర్లు భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల ఏళ్ల నుంచి వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది పాత వస్తువులు కాదు, మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు... అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు సిద్ధిస్తాయి.

బొమ్మల కొలువు.. భోగి పండ్లు

భోగి రోజున బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగు పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.

భోగి పండ్ల వెనుక సంప్రదాయం ఇదే

రేగు పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు. కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.

సంప్రదాయం వెనుక శాస్త్రీయత

మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రాన ఆచార, సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!