*కరోనా వ్రతము*
వాకిట్లో నుంచి "ఆంటీ !ఆంటీ "అన్న పిలుపుకి వాకిట్లోకి తొంగిచూసాను. మావీధిలో మూడోయింట్లో ఉండే సీతా వాళ్ళ అమ్మాయనుకుంటా ...రెండుజెళ్ళూ ,పచ్చని పట్టులంగా ,కళ్ళకు సేఫ్టీ గ్లాసులూ ,డ్రెస్ కు మాచయ్యే మాస్కూ పెట్టుకుని వచ్చింది.
కరోనా పుణ్యమాని జనాలకి బాగా జాగ్రత్తలూ,సామాజిక దూరం అదే సోషల్ డిస్టెన్సింగూ బాగా అబ్బేయి. ఇంట్లోకి కూడా రమ్మనకుండా "ఏంటీ ?ఏంకావాలీ "అని వాకబ్ చేసాను.
"అమ్మ ఈరోజు కళ్యాణ కరోనా గౌరి నోము నోచుకుంటోంది ఆంటీ మిమ్మల్ని తప్పకుండా వచ్చి వాయినం తీస్కోమంది. మీ టైము 11.10 ఆటైం కల్ల తప్పకుండా రమ్మంది." అంది కుంకుమ భరిణ తీస్తూ.
ఏమాత్రం సంకోచించకుండా .."ఆ గడపకు పెట్టివెళ్ళు "అన్నాను. అలాగే అంటూ గడపకు బొట్టుపెట్టి వెళ్ళిందా అమ్మాయి. వెంఠనే డిసిన్ఫెక్టెంట్ స్ప్రే తెచ్చి కొట్టాను దానిమీద. కరోనా పుణ్యమాని ప్రజల్లో మొహమాటాలూ ,అనవసర మర్యాదలూ పోయాయి.
ఇంక ఇంట్లోకి పిలిచి కూచోమని మర్యాదలు చేయటం ,కాఫీలు గట్రా ఇవ్వటం జనాలు మానుకుని చాలా రోజులైంది.
ఇళ్ళల్లో కూడా పనిమనుషులని పెట్టుకోటం ఎప్పుడో మానేసారు. ఎవరి కంచాలు వాళ్ళు కడుక్కోటం ,ఎవరిబట్టలు వాళ్ళు ఉతుక్కోవటానికి అలవాటు పడిపోయారు.
పెళ్ళిళ్ళూ ప్రస్థానాలకు కూడా ఎవరూ వెళ్ళటం లేదు. నెట్లోనే పెళ్ళిళ్ళు చూస్తూ తమ ఇళ్ళల్లోంచే ఆశీర్వాదాలూ ,కానుకలుగా నెట్ బాంకింగ్ ద్వారా డబ్బులూ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పెళ్ళివారూ ఆన్లైన్లో ఉప్పూ ,పప్పూ కూరగాయలూ పంపిస్తూ ఎవరిళ్ళల్లో వాళ్ళు వండుకుతినమంటున్నారు.
ఈవిధంగా సమాజంలో గృహనిర్బంధమూ ,అంటరాని తనమూ ,సామజిక మడీ మైంటెయిన్ చేస్తూ ..జనం బతికి బట్టకడుతున్నారు.
అందుకే పేరంటానికీ ఒక టైమింగ్ ..నా టైంకి నే వెళ్ళి వాయినం తెచ్చుకోవాలి. కాక పోతే ....ఈ నోము ఇంతవరకూ నేను చూడలేదు అందుకే సీతకు ఫోన్ చేసాను. నోము జరిగేటప్పుడే వచ్చేస్తానని.
"సరే !మీ ముందు స్లాటు రోహిణి గారిది. ఆవిడను మీటైం కు రమ్మంటాను. మీరు ముందు వచ్చెయ్యండి." అని చెప్పింది. అక్కడా నలుగురికంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు మరి.
పదిన్నరకల్లా పింక్ చీరా ,పింక్ గ్లౌసూ ,పింక్ మాస్కూ ,పింక్ గ్లాసెస్ తో రడీ అయిపోయి ,ఒక డిస్ఇంఫెక్టెంట్ స్ప్రే ,ఒక హాండ్ సానిటైజరూ ,కొన్నివెట్ , కొన్ని డ్రై టిష్యూలూ సర్దుకొని పేరంటానికి వెళ్ళాను.
వాకిలి బైటే చెప్పులు విడిచేసి అక్కడేఉన్న సోప్ వాటర్ తో కాళ్ళు కడుక్కుని టిష్యూ తో తుడుచుకుని ఇంట్లోకి అడుగుపెట్టాను. దేవుడి గది కనడేలా కొంచెం దూరంగా వేసిన కుర్చీని చూపించింది సీతకూతురు.
మాస్కులో నవ్వినా కనపడదు గనుక తలూపి ,బాగ్ లోనించి డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే తీసి కుర్చీ అంతా జాగ్రత్తగా చల్లుకుని కూర్చున్నాను. సీత అప్పటికే పూజ మొదలెట్టేసినట్లుంది.
నాకాళ్ళు కాస్త ముందుకు పెట్టమని ,చేతితో తాకకుండా డెట్టాల్ కలిపిన పసుపునీళ్ళు పాదాలకు స్ప్రే చేసిందా అమ్మాయి. మూరెడు పొడుగున్న గుండ్రటి పుల్ల ,సేవలాన్లో కలిపిన తిలకం లాంటి కుంకుమలో ముంచి లాఘవంగా దూరం నుంచే బొట్టు పెట్టింది.
అష్టోత్తరం నడుస్తోంది ఇలా ....
ఓం కరోనా దేవ్యై నమః
ఓం కరవ్యాపిన్యై నమః
ఓం విశ్వ వ్యాపితాయై నమః
ఓం నాసికాగ్ర ప్రవేశితాయై నమః
ఓం మనుష జాతి నిర్మూలనా దీక్షా దక్షాయై నమః
ఓం చీనీ దేశ జన్మస్థాయై నమః
ఓం ఇటలీ దేశ ప్రబలాయై నమః
ఓం సర్వాంతర్యామినే నమః
ఓం ప్రాణ హరణాయై నమః
ఓం శ్వాస కోశ భంజనాయై నమః
ఓం శీత జ్వరాయై నమః
ఓం ఔషధీ రహితాయై నమః
ఓం ప్రాణికోటి గృహబంధనాసక్తాయై నమః
ఓం సంఘ దూర కృతాయై నమః
ఓం అపరి శుభ్ర జన సంహారిణే నమః
ఓం పరిశుభ్ర జన రక్షాకర్త్యై నమః
ఓం ఉరఃపంజర భంజకాయై నమః
ఓం జన హృదయ భయవిహ్వల కర్త్యై నమః....
ఈ విధంగా నామాలు సాగాక ...అవసర నైవేద్యం పెట్టి అందరి అక్షతలూ తనచేతిలోనే పట్టుకొని ఈవిధం గా కధ చదవసాగింది.
"పూర్వం..నైమిశారణ్యం లో సూతమహాముని శౌనకాదిమునులకు ఈ విధంగా చెప్పదొడగెను.......
ఒకప్పుడు చీనీ దేశమున నొక మహమ్మారి పుట్టెను.అది మిక్కిలి భయానకంబై అదృశ్యరూపమున జనులను చంపసాగెను. అంతట 'లీ 'యనునొక మహా మేధావి యగు వైద్యశిఖామణి ఇది యొక కంటికి కనబడని సూక్ష్మ జీవియని గుర్తించి ,దాని నిర్మూలము చేయకున్నా జగత్తు నశించునని చెప్పగా జనులు నమ్మకుండిరి.
కొందరికి వైద్యము చేయుచూ అతడూ దానిపాలబడి మరణించిన పిమ్మట అందరూ గుర్తించి తగు జాగ్రత్తలో నుండిరి. కోవిడను క్రిమియే జన్మాంతరమున కరోనాగా అవతరించెనని తెలిసికొనిరి. ఈలోగా వేలకొలదీ జనులు అశువులు బాశిరి.
ఆతరువాత సబ్బులూ ,అనేక క్రిమి సంహారక మందులు వాడుచూ ,సంఘ దూరులై విపరీతమైన పరిశుభ్రతను పాటించుచూ ..కరములను పదేపదే కడుగుకొనుచూ ,నమస్కారాది నియమనిష్ఠలు పాటించుచూ కొంత తేరుకొని జనులు ప్రాణభయవిహ్వలులై జీవించుచుండిరి.
ప్రజల ప్రాయశ్చిత్త మింకనూ తీరకున్న కారణమున దీని వినాశనమింకయూ జరుగలేదు. దీని దృష్టి తమ గృహముపై పడరాదనుకున్నవారు శ్రద్ధగా ఈ వ్రతమాచరించి ,పదకొండుమంది ముత్తైదులకు పదకొండు వాయినములు ఇవ్వవలెను.
వాయినములో తప్పనిసరిగా
చేతి శుభ్రోదకము
శుభ్రతౌషధము
శుభ్ర కాగితములు
స్వేత చూర్ణము
ప్రక్షాళనా సబ్బు (ఎంతట్రై చేసినా దీనికి సంస్కృత పదం దొరకలేదబ్బా )
ఇవి తప్పనిసరిగా వాయనం ఈయ వలెను. ఈవ్రతము చేసి వాయనము ఇచ్చిన వారింటనూ తీసుకున్న వారింటనూ కరోనా మహమ్మారి అడుగు పెట్టదనిన్నీ ,వారిల్లు ఇదివరకు మాదిరే బందుమిత్రులతో నిత్య కల్యాణమూ పచ్చతోరణముగా నుండునని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పెను. "
ఇలా వ్రతకధ కధ చెప్పి ,మా పేర్లు కూడా చెప్పి కరోనా పటానికి అక్షింతలేసి నైవేద్యం పెట్టి హారతిచ్చింది.
"కరోనాదేవీ ..కరుణించవమ్మా
కటాక్షముంచీ ...కదలీరాకమ్మా
కరములూ పలుమార్లు ...కడిగేము తల్లీ
కన్నబిడ్డలనూ ..కాపాడవమ్మా "
ఇలాంటి హారతి పాట శ్రద్ధగాపాడింది
తరువాత పళ్ళెంలో పండూ తాంబూలమూ ,పసుపూ కుంకుమా ,జాకెట్టు ముక్కా ,బెల్లం ,పచ్చిశనగపప్పూ ,ఇంకా హాండ్ వాషూ ,శానిటైజరూ ,కొన్ని టిష్యూ పేపర్లూ ,సోపూ ,బ్లీచింగ్ పౌడరు పాకెట్టూ అన్నీ పెట్టి పైనించి శీల్ చేసి ఇచ్చింది.
చెరో పక్క టిష్యూ పేపర్ తో పట్టుకుని ...
కరోనావై ...ప్రతిగృణ్హాతు
కరోనావై ...దదానిచ అనీ ,
"ఇస్తినమ్మవాయినం ..."అని తనంటే
"పుచ్చుకొంటినమ్మ వాయినం ..".అని నేనన్నాను. ఇలా మూడుసార్లు అన్నాక ...
"ముమ్మాటికిస్తి మూసివాయినం నా వాయినం అందుకొన్నదెవరు ????"అని సీత అంటే
"నేనే కరోనా గౌరిని ..."అనినేనన్నాను.
"కోరితిని ఫలము అనితనంటే "..."ఇస్తిని ఫలము "అన్నాను ...తను కంగారుగా ..."అలా అనకూడదక్కా ....మీయింటికి రాను అని చెప్పాలి "అంది. "అలాగే మీయింటికి రాను ... "
అని వాయినం పుచ్చుకొని ఇంటికొచ్చాను.
వాకిట్లోకి రాగానే వాయినం మ్మీద మళ్ళీ డిస్ఇంఫెక్టెంట్ స్ప్రేచేసి అమ్మా !కరోనాతల్లీ !చల్లగా కాపాడమ్మా !అంటూ ఇంట్లో కొచ్చా.
ఇంకొకావిడ పాడిన పాట నాకు భలే నచ్చింది. అదే కూనిరాగం తీసుకుంటున్నా ...
"మాయింటికి రాకు ,మా బజారుకి రాకు ,మావూరికి రాకు ,మాదేశానికేరాకు ...రాకూ ....రాకూ ...రాకూ ....రాకూ ..."
"మిట్టమధ్యాహ్నం తిని పడుకోని ఏమిటా కలవరింతలూ ..."అని శ్రీవారు తట్టి లేపగానే ...అయోమయంగా లేచి కూచున్నాక కాసేపటికి గానీ అర్ధం కాలేదు ఇది కల అనీ ....
వెంఠనే మిత్రులతో పంచుకోవాలని ఇలా రాసేసా ...సరదాగా నవ్వుకోండేం. 😆😆😆
Hi Please, Do not Spam in Comments