💕💕💕💕💕💕💕💕💕💕💕💕
🍁ఆ ఊరిలో ఒక రైతు..🍁
ఒక జ్యోతిష్కుడు ఒక గ్రామానికి వచ్చాడు. ‘‘ఇక ఈ ప్రాంతంలో పుష్కరకాలం వర్షాలు పడవు’’ అని చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పుడు ఆ గ్రామ ప్రజలు కొందరు ‘‘ఈ ఊరు వదలి వెళ్ళిపోదాం’’ అనుకున్నారు. మరికొందరు ‘‘మన దగ్గర ధాన్యం ఉంది. వచ్చినంతవరకూ తింటూ ఉందాం. ఇల్లు వదలి బయటకు పనుల కోసం పోనవసరం లేదు. హాయిగా తిని కూర్చోవచ్చు’’ అనుకున్నారు. వాళ్ళు అలాగే తింటూ, ఒళ్ళు పెంచుకున్నారు. సోమరులైపోయారు.
కానీ, ఆ ఊరిలో ఒక రైతు అలా ఆలోచించలేదు. ఉదయాన్నే లేచి, పొలం వెళ్ళేవాడు. దున్నేవాడు. దుగిలి ఏరేవాడు. గట్లు నరికి, శుభ్రం చేసేవాడు.
ఒక రోజు అతను నాగలి దున్నుతున్నాడు. ఆ సమయంలో ఆకాశంలోంచి వెళ్తున్న మేఘాలు ఈ రైతును చూసి, ఆశ్చర్యపోయాయి. వెంటనే కిందికి వచ్చి, రైతు ముందు వాలి-
‘‘ఓయీ! నువ్వొక మూర్ఖునిలా ఉన్నావే? మేము పన్నెండేళ్ళు వర్షించం అని తెలుసు కదా! తెలిసి కూడా ఈ పిచ్చి పని ఏమిటి? ఈ పొలం పనులు ఎందుకు?’’ అని హేళన చేస్తూ అడిగాయి.
‘‘మేఘాల్లారా! మీరు వర్షించరని నాకు తెలుసు. నేనూ అందరిలా ఇంట్లో కూర్చొని తినగలను. కానీ, అలా ఉంటే ఈ పన్నెండేళ్ళలో నా పనులను నేనే మరచిపోతాను. సోమరితనం పేరుకుపోతుంది. అప్పుడు మీరు వర్షించినా నేను ఏం చేయగలను? నాకు ఉపయోగం ఏముంది? అందుకని మీరు వర్షించినా, వర్షించకపోయినా నా పని మాత్రం నేను మానను’’ అన్నాడు.
👉ఆ రైతు మాట వినగానే మేఘాలు భయపడ్డాయి. ఆలోచనలో పడ్డాయి.
‘‘అవును! పన్నేండేళ్ళు కురవడం మానేస్తే... అప్పుడు మన పని మనం మరిచేపోతాం. సోమరులవుతాం. వద్దు, వద్దు. అలా కావొద్దు’’ అనుకుంటూ ఆకాశానికి లేచాయి. వెంటనే వర్షించాయి.
పొలాన్ని దున్ని, సిద్ధం చేసిన ఆ రైతు వెంటనే విత్తనాలు నాటాడు.🍁
💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Hi Please, Do not Spam in Comments