*మేడారం జాతర*
ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా సమ్మక్క-సారలమ్మ జాతర వర్ధిల్లుతోంది. ప్రతి రెండేళ్లకోసారి మాఘపౌర్ణమికి ముందు నాలుగురోజుల పాటు ఈ మహాజాతర భక్తజన సందోహంతో పోటెత్తుతుంది.
కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ప్రారంభించిన ఈ వనదేవతల సమారాధన అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం మహత్తరమైన జాతర శోభను సంతరించుకుంది. మేడారం జాతర నేపథ్యానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. జానపదులు ఆలపించే గీతాలతో సమ్మక్క సారలమ్మ జీవనగాథలు బహుళ వ్యాప్తి పొందాయి. 12వ శతాబ్దంలో జగిత్యాల ప్రాంతంలోని పొలవాసకు చెందిన గిరిజన నాయకుడు మేడరాజుకు అటవీ ప్రాంతంలో ఓ బాలిక లభించింది. శక్తిమాత భక్తుడైన మేడరాజు ఆ శిశువును దైవప్రసాదంగా స్వీకరించాడు. సమ్మక్కగా నామకరణం చేసి, తన బిడ్డగా పెంచి పెద్దచేశాడు. తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుతో ఆమె వివాహం చేశాడు. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే సంతానం కలిగారు. కాకతీయ చక్రవర్తి మొదటి ప్రతాపరుద్రుడు రాజ్యవిస్తరణ కాంక్షతో పొలవాసపై దండెత్తాడు. కాకతీయ సైన్యాల ధాటికి తట్టుకోలేని గిరిజనులు మేడారానికి తరలివెళ్లారు.
అప్పటికే కాకతీయులకు సామంతుడిగా ఉన్న పగిడిద్ద రాజు తీవ్ర కరవు కాటకాలవల్ల చక్రవర్తికి కప్పం చెల్లించలేకపోయాడు. మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం, కప్పం చెల్లించకపోవడమనే కారణాలతో ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధం ప్రకటించాడు. కాకతీయ సైన్యాలు మేడారంపై విరుచుకుపడ్డాయి. సంపెంగవాగు దగ్గర పగిడిద్దరాజు, అతడి సంతానమైన సారలమ్మ, నాగులమ్మ, సారలమ్మ భర్త గోవిందరాజు వీరమరణం పొందారంటారు. పోరులో పరాజయాన్ని అంగీకరించలేక జంపన్న ఆ వాగులో దూకి మరణించాడు. నాటి నుంచి ఆ సంపెంగ వాగు, జంపన్నవాగైంది. సమరరంగానికి తరలి వచ్చిన సమ్మక్క కాకతీయ సైన్యంపై అపర దుర్గాశక్తిగా వీరవిహారం చేసింది. చివరిక్షణం వరకు పోరాడి, శత్రువుల చేజిక్కకుండా నెత్తురోడుతూనే సమీపంలో చిలకలగుట్టపైకి సమ్మక్క వెళ్లింది. ఆ గుట్టపై ఉన్న నాగమల్లి వృక్షం కింద ఓ కుంకుమ భరిణెలో తన రుధిరాన్ని నింపి, తన జీవశక్తిని ఆ భరిణెలో సమ్మక్క నిక్షిప్తం చేసిందంటారు. ఆపై అదృశ్యమై వెదురు కర్రగా ఆవిర్భవించిదంటారు.
రెండు వెదురు కర్రలకు కట్టిన కుంకుమ భరిణెల రూపంలో జంట వనదేవతలుగా, తల్లీబిడ్డలు (సమ్మక్క-సారలమ్మ) భక్తుల్ని అనుగ్రహిస్తారని ప్రతీతి. నాలుగురోజులపాటు సాగే ఈ జాతరలో మొదటిరోజును ఆది ఘట్టంగా వ్యవహరిస్తారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క ప్రతిబింబమైన కుంకుమ భరిణెను తోడ్కొనివస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ ప్రతిరూపమైన పసుపు భరిణెను తీసుకొస్తారు. ఈ రెండింటిని కొత్తవెదురు కర్రలకు కట్టి, జలాభిషేకం చేస్తారు. సమ్మక్క, సారలమ్మలకు ‘మండెమెలిగే’ పేరిట తొలిపూజలు నిర్వహిస్తారు. రెండోరోజు మహాఘట్టంలో ‘మందిర సారె’ పేరుతో జంటశక్తి మాతలకు చీరసారెల్ని సమర్పిస్తారు. మూడో రోజున ‘నిండు జాతర’ నాడు మేడారం లక్షలాది భక్తుల సందోహంతో వర్ధిల్లుతుంది. బెల్లపు దిమ్మెల్ని ‘బంగారం’గా వ్యవహరిస్తూ వాటిని అమ్మతల్లులకు భక్తులు మొక్కుబడులుగా చెల్లిస్తారు. నాలుగోరోజు శక్తిమాతల ‘వనప్రవేశం’తో ఈ జాతర ముగుస్తుంది.
అపరకాళిగా సమ్మక్క వీర రసావిష్కరణం ప్రతాపరుద్రుడి ప్రవర్తనలో మార్పు కలిగించింది. పరివర్తన చెంది అహాన్ని వదిలి ఆధ్యాత్మిక చింతనతో సమ్మక్క, సారలమ్మలకు ఉత్సవ సంప్రదాయాన్ని నిర్వహించే ఏర్పాటు చేశాడు. అలనాటి ఆ ఆచారమే ‘మేడారం జాతర’గా విరాట్ వైభవాన్ని సంతరించుకుంది.